కేవైసీ అప్‌డేట్‌ పేరుతో.. ఖాతాలు ఖాళీ..!

సైబర్‌ క్రిమినల్స్‌.. పేటీఎం ఖాతాదారులను టార్గెట్‌ చేస్తున్నారు. కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలి.. లేకుంటే పేటీఎం సేవలు నిలిచిపోతాయి... మీ లావాదేవీలు స్తంభించిపోతాయి..అంటూ  ఖాతాదారులకు ఫోన్‌చేసి వారిని అయోమయంలో పడేస్తున్నారు. అప్‌డేట్‌ పేరుతో వారి నుంచి వివరాలు తెలుసుకుని.. ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇలా చాలామంది సైబర్‌ నేరగాళ్లబారిపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి వ్యక్తి యూపీఐ యాప్‌లు పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే తదితర యాప్‌లను పెట్టుకుంటున్నారు. ఇందులో పేటీఎంకు సంబంధించి తప్పనిసరిగా కేవైసీని నింపాల్సిన అవసరం ఉంటుంది. ఇతర యాప్‌ల్లో అంతా అవసరం ఉండదు. దీంతో సైబర్‌ జాదుగాళ్లు పేటీఎం ఖాతాదారులపై గురిపెట్టి .. కేవైసీ చేసుకోకపోతే సేవలు ఆగిపోతాయని ఆందోళనకు గురి చేస్తున్నారు. వాటి మాటలు నమ్మి చాలామంది .. వారు అడిగిన వివరాలు చెప్పేస్తున్నారు. ఖాతాదారులను ఫోన్‌లైన్‌లోనే పెట్టి.. వారు చెప్పిన వివరాలతోనే డబ్బులు కొట్టేస్తున్నారు.